Movie Theaters: 14 రాష్ట్రాల్లో తెరచుకున్న సినిమా హాల్స్... తొలి చిత్రంగా దక్షిణాదిన 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ వెర్షన్!

  • తొలి రోజున సరిగ్గా కనిపించని ప్రేక్షకులు
  • తెలుగు రాష్ట్రాల్లో తెరచుకోని థియేటర్లు
  • నిబంధనలకు అనుగుణంగా సినిమాలు
Movie Theaters Reopened in 14 States

కేంద్రం వెలువరించిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తిరిగి తెరచుకున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్, కేరళ తదితర రాష్ట్రాల్లో మూవీ థియేటర్లు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఇంకా థియేటర్లను తెరిచేందుకు అనుమతించలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కాగా, సినిమా థియేటర్లలో తొలి రోజు కొవిడ్ ప్రొటోకాల్ నిబంధనలను యాజమాన్యాలు అమలు చేశాయి. థియేటర్ కెపాసిటీలో 50 శాతం లేదా గరిష్ఠంగా 200 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా, ఆ మాత్రం ప్రేక్షకులు కూడా తొలి రోజున కనిపించలేదు. థియేటర్ల టైమింగ్స్ ను కూడా మార్చారు. 

ఇక ప్రేక్షకుల కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం హాల్ కు వచ్చిన ప్రతిఒక్కరి ఫోన్ నంబర్లనూ థియేటర్ల సిబ్బంది సేకరించారు. థర్మల్ స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. ఇక,దక్షిణాదిన కేరళలో తొలి చిత్రంగా సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' మలయాళ వెర్షన్ ను విడుదల చేశారు. ఈ సినిమా డబ్బింగ్ కరోనాకు ముందే పూర్తికాగా, లాక్ డౌన్ వల్ల విడుదల ఆగిపోయింది. ఇక నేడో, రేపో మాలీవుడ్ లో అమిత ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' కూడా విడుదల కానుంది.

More Telugu News