imf: ప్రపంచం సాధారణ స్థితికి చేరుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంది: ఐఎంఎఫ్‌ చీఫ్‌

  • ప్రపంచ దేశాలు చేస్తున్న సాయం ముందస్తుగా నిలిపివేయొద్దు  
  • వృద్ధి అంచనాలను నివేదించిన ఐఎంఎఫ్ 
  • వచ్చే ఏడాది వృద్ధిరేటు అంచనాలపై అనిశ్చితి 
imf warns countries

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనమైన విషయం తెలిసిందే. అయితే, మొదట అంచనా వేసినంతగా దిగజారిపోలేదు. అయినప్పటికీ కరోనా సృష్టించిన సంక్షోభం ఇంకా సమసిపోలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.

ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి అంచనాలు కొంతమేర పెరిగే వెసులుబాటు కలిగిందన్నారు. అప్‌డేట్‌ చేసిన వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ ప్రపంచబ్యాంక్‌కు నివేదించింది. మొదట ప్రపంచ జీడీపీ వృద్ధి 5 శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది, అయితే, రెండు, మూడు త్రైమాసికాల్లో ఫలితాలు ఆశించిన దానికంటే బాగున్నాయి.

 ప్రభుత్వాల నుంచి సంస్థలకు, ప్రజలకు ప్రయోజనాలు అందడంతో ప్రపంచ వృద్ధి రేటు మళ్లీ పుంజుకుందని తెలిపారు. అయితే, ఆయా దేశాలు చేస్తున్న ఈ సాయం ముందస్తుగా నిలిపివేయొద్దని కోరారు. వచ్చే ఏడాది వృద్ధిరేటు అంచనాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రపంచం ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అమెరికా, యూరప్‌ల్లో ముందు ఊహించినంత ఆర్థిక సంక్షోభం లేదని ఆమె తెలిపారు. చైనా కూడా అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటోందని తెలిపారు. తక్కువ ఆదాయ దేశాల్లో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు.

More Telugu News