New Delhi: బొగ్గు కుంభకోణం కేసులో తీర్పు.. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే సహా నలుగుర్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం!

  • 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో అక్ర‌మాలు 
  • వాజ్‌పేయీ హ‌యంలో ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా దిలీప్ 
  • ఈ నెల 14న వీరందరికీ శిక్ష ఖరారు  
Judge finds former Minister of State Dilip Ray guilty

బొగ్గు కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో వారు అక్ర‌మాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సుదీర్ఘ విచారణ కొనసాగింది. 1999లో ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఈ కేటాయింపుల్లో వీరు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది. వాజ్‌పేయీ ప్ర‌భుత్వ హ‌యంలో ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా దిలీప్ పనిచేశారు. నలుగురు దోషులు నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్యేక జ‌డ్జి భార‌త్ ప‌రాశ‌ర్ తెలిపారు. కాగా, దిలీప్‌తో పాటు దోషులుగా తేలిన వారిలో బొగ్గుగ‌నుల శాఖ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నెల 14న కోర్టు వీరందరికీ శిక్షను ఖరారు చేయనుంది.

More Telugu News