Mahesh Babu: 'సర్కారు వారి పాట' అమెరికా షెడ్యూల్ సంగతులు!

  • బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సాగే కథ 
  • అమెరికాలో తొలి షెడ్యూలు షూటింగ్
  • అక్టోబర్ నెలాఖరులో యూఎస్ కు యూనిట్
  •  విలన్ పాత్రలో అరవింద్ స్వామి?  
Mahesh latest flick shoot in US

మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రానికి లాక్ డౌన్ దెబ్బ గట్టిగానే తగిలింది. షూటింగులకు బ్రేక్ పడడంతో ఈ భారీ చిత్రం కూడా ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు మెల్లగా షూటింగులు మొదలవుతుండడంతో, ఈ సినిమా తొలి షెడ్యూలు షూటింగును అమెరికాలో నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. దీంతో విదేశాలలో కూడా షూటింగ్ చేయాల్సివుండడం వల్ల అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్టోబర్ నెలాఖరులో చిత్రం యూనిట్ అమెరికాకు వెళుతుందని, నవంబర్ తొలి వారం నుంచి షూటింగ్ మొదలెడతారనీ తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు, ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరిస్తారని సమాచారం. సుమారు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఆ షెడ్యూలులో మొత్తం మీద నలభై శాతం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.

మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే కొన్ని పాటలకు ట్యూన్స్  సిద్ధం చేశాడట.

More Telugu News