Uttar Pradesh: ముంబైలో దొరికిన యూపీ గ్యాంగ్‌స్టర్.. లక్నోకు తీసుకొస్తుండగా ప్రమాదంలో మృతి

  • పోలీసుల కళ్లుగప్పి ముంబై పారిపోయిన గ్యాంగ్‌స్టర్
  • ఆవును తప్పించే క్రమంలో ప్రమాదం
  • ప్రమాదంలో ఫిరోజ్ బావ చేయికి తీవ్ర గాయం
up gangster Firoz ali killed in road accident

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు ఫిరోజ్ అలీ అలియాస్ షమీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అలీ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల కళ్లుగప్పి ముంబై పారిపోయిన అలీ.. అక్కడి నాలా సొపారే అనే మురికివాడలో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న లక్నో పోలీసు ఉన్నతాధికారులు అలీని అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు ఠాకూర్‌గంజ్ ఏఎస్‌ఐ జగదీశ్ ప్రసాద్ పాండే నేతృత్వంలోని బృందాన్ని ముంబై పంపారు.  

ముంబైలో ఫిరోజ్‌, అతడి బావ అఫ్జల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కారులో లక్నోకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా సమీపంలో ఆవును తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. అఫ్జల్ చేయి విరిగినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రాజేశ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు.

More Telugu News