Keesara: మాజీ తహసీల్దార్ నాగరాజు మరో లీల.. రూ. 48 కోట్ల విలువైన భూములకు రూ. 2 కోట్ల లంచం!

  • రూ. 1.1 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు
  • మరో వ్యవహారంలో రూ. 2 కోట్ల లంచం తీసుకున్నట్టు గుర్తింపు
  • ప్రభుత్వ ఆదేశాలతో మరో కేసు నమోదు చేసిన ఏసీబీ
Another case agaist Keesara ex tehsildar Nagaraj

కీసర మాజీ తహసీల్దారు నాగరాజు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూరికార్డుల మార్పిడి కోసం రూ. 1.1 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు మరో వ్యవహారంలో రూ. 2 కోట్లు తీసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాదంలో చిక్కుకున్న భూమి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగానే తప్పుడు మార్గంలో పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు ఏసీబీ తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ఏకంగా రూ. 2 కోట్ల లంచం కూడా తీసుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో  కందాడి ధర్మారెడ్డి పేరిట 1.02 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసుపుస్తకాలు జారీ చేస్తూ జులై 9న నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే, మార్కెట్ విలువ ప్రకారం రూ. 48 కోట్ల విలువైన 24.16 ఎకరాల భూమి వివాదంలో ఉండగా, ఉన్నతాధికారుల వద్ద ఈ వ్యవహారం పెండింగులో ఉంది.

అయినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా నాగరాజు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు గుర్తించారు. ఈ భూమి పేరిట  22 మార్చి 2010లో నకిలీ ఉత్తర్వులు సృష్టించినట్టు గుర్తించినా క్రిమినల్ కేసు నమోదు చేయించలేదు సరికదా, ఆ విషయాన్ని దాచిపెట్టి కొత్త పాస్ పుస్తకాలపై డిజిటల్ సైన్ చేసినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News