Sunrisers Hyderabad: ఐపీఎల్ 2020: టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన సన్ రైజర్స్

  • నేడు సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు
Sunrisers won the toss and elected field first

ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఛేదన సులభంగా ఉంటుందన్న అంచనాతో సన్ రైజర్స్ శిబిరం ఈ మేరకు వ్యూహ రచన చేసింది.

ఇక, సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ మరోసారి దంచికొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వార్నర్ తో పాటు బెయిర్ స్టో, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే బ్యాటింగ్ లో రాణిస్తే ఛేజింగ్ లో ఎలాంటి లక్ష్యమైనా ఉఫ్ అంటూ ఊదేయొచ్చు. బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ కు మంచి వనరులే ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ మరోసారి కీలకం కానున్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికొస్తే... కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, శివమ్ దూబే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. బౌలింగ్ లో ఈసారి బెంగళూరుది పైచేయిగా కనిపిస్తోంది. డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ వంటి స్పీడ్ స్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఈ ముగ్గురూ నిలకడగా 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు విసరగల సత్తా ఉన్నవాళ్లే. చాహల్,  వాషింగ్టన్ సుందర్ స్పిన్ కూడా తక్కువగా చూడ్డానికి లేదు. పిచ్ అనుకూలిస్తే వీళ్లిద్దరూ ప్రత్యర్థుల పాలిట ప్రమాదకరంగా పరిణమించగలరు.

More Telugu News