Vellampalli Srinivasa Rao: మూడు సింహాలు మాయం ఘటన గత ప్రభుత్వ హయాంలో జరిగిందో, ఇప్పుడు జరిగిందో తేలుతుంది: వెల్లంపల్లి

  • బెజవాడ దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాలు మాయం
  • విచారణ కమిటీ వేస్తున్నామన్న మంత్రి వెల్లంపల్లి
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని వెల్లడి
AP Minister Vellampalli reacts over three lions missing incident at Kanakadurga temple

బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మూడు రథాలు ఉండగా, వాటిలో ఒకటి వెండి రథం. ఈ రథానికి నాలుగు వైపులా వెండి ప్రతిమలు అమర్చారు. అయితే వాటిలో మూడు సింహాల ప్రతిమలు కనిపించకపోవడం ఇప్పుడు విమర్శపాలవుతోంది. ఈ నేపథ్యంలో వెండిరథం ఉంచిన ప్రాంతాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు కనిపించడంలేదని తేలిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన గత ప్రభుత్వ హయాంలో జరిగిందో, ఇప్పుడు జరిగిందో విచారణలో వెల్లడవుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని వెల్లంపల్లి ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తున్నామని తెలిపారు.

రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు దానిపై టార్పాలిన్ తో కప్పి ఉంచారని, టార్పాలిన్ తొలగించిన సమయంలో మూడు సింహాలు మాయమైనట్టు గుర్తించారని, వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రథాన్ని ఒక్కసారి కూడా ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News