Sravani: సాయికృష్ణారెడ్డి ఏ1.. టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు కారణాలు వివరించిన డీసీపీ

  • ఇటీవల హైదరాబాదులో టీవీ నటి శ్రావణి బలవన్మరణం
  • సాయి, దేవరాజ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరినీ హాజరుపర్చిన డీసీపీ
  • నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని వెల్లడి
  • వీళ్లతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టీకరణ
DCP tells what happened behind tv actress Sravani suicide

హైదరాబాదులో నటి శ్రావణి ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఆత్మహత్య నేపథ్యంలో దేవరాజు రెడ్డి, సాయి అనే వ్యక్తులు కూడా తెరపైకి వచ్చారు. శ్రావణి స్వస్థలం కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు. అయితే సినిమాలపై ఆసక్తితో ఆమె హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఓ స్నేహితురాలు ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. దీనిపై డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అసలు విషయాలు వెల్లడించారు. శ్రావణి రియల్ స్టోరీ ఏమిటో డీసీపీ మాటల్లోనే....

"ఈ నెల 8న శ్రావణి హైదరాబాద్ మధురానగర్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. మా దర్యాప్తులో అనేక విషయాలు తెలిశాయి. శ్రావణి 26 ఏళ్ల అమ్మాయి. ఆమె 2012లో హైదరాబాద్ వచ్చింది. అప్పటినుంచి టీవీ ఆర్టిస్టుగా అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 2015లో శ్రావణికి సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు. 2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డి నిర్మించిన 'ప్రేమతో కార్తీక్' అనే చిత్రంలో శ్రావణి చిన్న పాత్ర పోషించింది. అప్పటి నుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది.

2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డి పరిచయం అయ్యాడు. టిక్ టాక్ వీడియోలతో వీరికి పరిచయం ఏర్పడింది. దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో అప్పటినుంచి శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులే కాక, సాయి, అశోక్ రెడ్డి కూడా హెచ్చరిస్తుండేవారు.

ఈ క్రమంలో మేం దేవరాజ్ రెడ్డి కాల్ డీటెయిల్స్ కూడా విశ్లేషించాం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె గత సంబంధాలు తెలిసి దూరంగా పెట్టాడు. శ్రావణి తీరు నచ్చక మాట మార్చాడు. దాంతో శ్రావణి మనస్తాపం చెంది తల్లిదండ్రులకు, సాయికి, అశోక్ రెడ్డికి, దేవరాజ్ కు దూరంగా ఉండడం ప్రారంభించింది.

ఈ క్రమంలో సాయి, అశోక్ రెడ్డి, తల్లిదండ్రులు మరింత వేధించసాగారు. సాయి, అశోక్ రెడ్డి తనపై భౌతికదాడులు చేశారని కూడా శ్రావణి ఓ సందేశంలో తెలిపింది. సాయి, అశోక్ రెడ్డిల బెదిరింపులు, దాడులు... తల్లిదండ్రుల ప్రవర్తన.... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన దేవరాజ్ రెడ్డి ఆపై దూరంగా జరగడం... ఇవన్నీ శ్రావణిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది.

అందుకే ఈ కేసులో సాయికృష్ణారెడ్డిని ఏ1, అశోక్ రెడ్డిని ఏ2, దేవరాజ్ రెడ్డిని ఏ3గా పేర్కొంటున్నాం. ఈ కేసులో ఈ ముగ్గురూ నిందితులు. ఇప్పటికే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అరెస్ట్ చేశాం. అశోక్ రెడ్డిని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం. వీరు ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసినవాళ్లే. ఇలాంటి వాళ్ల పట్ల మిగతా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి" అని వివరించారు.

ఈ ఘటనలో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా పేర్కొనకపోవడానికి గల కారణాలను కూడా డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఏ కూతురిని కూడా తల్లిదండ్రులు చనిపోవాలంటూ వేధించరని, ఆమె శ్రేయస్సు కోరి కొంత కఠినంగా వ్యవహరించి ఉండొచ్చని తెలిపారు. తాము విశ్లేషించిన సంభాషణల్లో శ్రావణిని తల్లిదండ్రులు కూడా ఇబ్బందిపెట్టినట్టు వెల్లడైందని, కానీ తల్లిదండ్రులను ఇందులో నిందితులుగా పేర్కొనడం మాత్రం కుదరదని, వారిని బాధిత వ్యక్తికి చెందినవారిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

More Telugu News