DGCA: విమానాల్లో ఫొటోలు తీయడంపై నిషేధం విధించలేదు: డీజీసీఏ వివరణ

  • కంగనా ప్రయాణించిన విమానంలో మీడియా హంగామా
  • సీరియస్ గా పరిగణించిన డీజీసీఏ
  • తన ఆదేశాలపై మరింత స్పష్టత ఇచ్చిన డీజీసీఏ
DGCA clarifies on photography in flights

ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రయాణించిన విమానంలో మీడియా ప్రతినిధులు కెమెరాలతో హంగామా చేయడంపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రెండు వారాల నిషేధం ఉంటుందని డీజీసీఏ ఎయిర్ లైన్స్ సంస్థలను హెచ్చరించింది. ఈ విషయంలో డీజీసీఏ మరింత స్పష్టతనిచ్చింది. విమానాల్లో ఫొటోగ్రఫీపై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.

విమానం లోపల ప్రయాణికులు ఫొటోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే రక్షణశాఖ పరిధిలోని ప్రాంతాల్లో ఫొటోలు తీయడం నిషిద్ధమని వివరించింది. షెడ్యూల్డ్ విమానాల్లో ప్రయాణికులు ఫొటోలు తీసుకోవడంపైనా, వీడియోలు తీసుకోవడంపైనా ఎలాంటి ఆంక్షలు లేవని, విమానం గాల్లో ఉన్నప్పుడు కానీ, ల్యాండింగ్ సమయంలో కానీ అభ్యంతరాలు లేవని డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే విమానంలో భద్రతకు భంగం కలిగించేలా రికార్డింగ్ పరికరాలు ఉపయోగించడం, తద్వారా విమాన సిబ్బందికి ఆటంకాలు కలిగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

More Telugu News