china: ఐదుగురు భార‌త యువ‌కుల‌ను అప్ప‌గించిన చైనా

  • ఇటీవ‌ల త‌ప్పిపోయిన అరుణాచ‌ల్ యువ‌కులు
  • భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఘ‌ట‌న‌
  • ఈ రోజు ఉద‌యం అప్ప‌గింత ప్ర‌క్రియ పూర్తి
arunachal 5 youngsters reaches india

భారత్‌-చైనా సరిహద్దులోని అడవుల్లో చైనా సైనికుల చేతిలో అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకుల జాడ తెలిసిందని ఇటీవ‌లే కేంద్ర స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు ప్ర‌క‌టించి, చైనా నుంచి వారిని తీసుకొచ్చేందుకు ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఈ ప్ర‌క్రియ ముగిసిన నేప‌థ్యంలో  ఆ ఐదుగురు భారతీయ పౌరులను చైనా విడిచిపెట్టింది.

ఆ ఐదుగురు వాస్తవాధీన రేఖను పొర‌పాటున దాటివెళ్లినట్లు చెబుతూ భారత ఆర్మీ ప్ర‌క‌ట‌న చేసింది. చైనా భూభాగంలో ఈ రోజు ఉద‌యం ఈ ప్ర‌క్రియ జ‌రిగింది. కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్ కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు.

కాగా, ఇండో టిబెటన్‌ భద్రతా దశాలు స్థానికులను సహాయకులుగా వినియోగించుకుంటాయి. వారితో త‌మ‌కు అవసరమైన సామగ్రిని తెప్పించుకుంటుంటాయి. ఈ నేప‌థ్యంలోనే  అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు దారి తప్పిపోయారు. దీంతో వెంట‌నే సరిహద్దుల వద్ద వారిని చైనా సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. మొద‌ట త‌మ‌కు వారి జాడ గురించి తెలియ‌ద‌న్న‌ చైనా అనంత‌రం వారు త‌మ వ‌ద్దే ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది.

More Telugu News