Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం?

  • పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'
  • బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే కథ
  • బ్యాంక్ ఆఫీసర్ గా, బ్రోకర్ గా రెండు పాత్రలు
  • అమెరికాలో తొలి షెడ్యూలుకి ఏర్పాట్లు  
Mahesh Babu to play double roles

హీరోలు ద్విపాత్రాభినయం చేయడం అనేది మొదటి నుంచీ మనం చూస్తూనే వున్నాం. అయితే, బలమైన కథ, రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయగలిగే బలమైన సన్నివేశాలు ఉన్నప్పుడే అలాంటి పాత్రలు పండుతాయి. లేకపోతే రెండింటిలోనూ ఏదో ఒకటి తేలిపోతుంది. అందుకే, అలాంటి శక్తిమంతమైన పాత్రలతో కూడిన కథ దొరికినప్పుడు మన స్టార్ హీరోలు కూడా ద్విపాత్రాభినయం చేయడానికి ఉత్సాహం చూపించి, ముందుకు వస్తారు.


ఇప్పుడు స్టార్ హీరో మహేశ్ బాబు కూడా అలాగే తొలిసారిగా ఓ చిత్రంలో డ్యూయల్ రోల్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ముచ్చట 'సర్కారు వారి పాట' సినిమాలో చోటుచేసుకోనున్నట్టు సమాచారం. పరశురాం దర్శకత్వంలో మహేశ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తొలి షెడ్యూలును ఈ ఏడాది చివర్లో అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో మహేశ్ రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బ్యాంకు ఆఫీసర్ గా ఒక క్లాస్ పాత్రలోనూ, బ్యాంకుల నుంచి అడ్డదారిలో రుణాలు ఇప్పించే బ్రోకర్ గా మాస్ పాత్రలోనూ మహేశ్ నటించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే!

More Telugu News