WHO: కరోనా వ్యాక్సిన్‌పై బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వచ్చే ఏడాది రెండో అర్ధ భాగం వరకు రానట్టే!

  • వ్యాక్సిన్లన్నీ ప్రయోగ దశలోనే..
  • అడ్వాన్స్ ట్రయల్స్‌ దశకు చేరుకోని టీకాలు
  • 50 శాతం సమర్థత కూడా నిరూపణ కాలేదన్న డబ్ల్యూహెచ్ఓ
Covid vaccines not expected until mid 2021 says WHO

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని, మరో రెండు మూడు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయని, ఏ దేశం కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రయల్స్ నిర్వహించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ పేర్కొన్నారు. కాబట్టి వచ్చే ఏడాది రెండో అర్ధభాగం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశ సుదీర్ఘంగా ఉంటుందని, ఈ సమయంలో వ్యాక్సిన్ ఎంత వరకు రక్షణ ఇస్తుందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటి వరకు ప్రకటించిన ఏ వ్యాక్సిన్ సమర్థత కూడా 50 శాతం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందలేదని  హ్యారిస్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ వాదన ఇలా ఉంటే అమెరికా మాత్రం అక్టోబరు చివరి నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించింది. నవంబరు 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే టీకాను అందరికీ అందుబాటులో తీసుకొస్తామని పేర్కొంది.

More Telugu News