Kala venkatrao: భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. సాక్ష్యాధారాలు చూపిస్తాం: కళా వెంకట్రావు

  • ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని సూట్‌కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారు
  • ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 23 వేల ఎకరాల్లో అధిక భాగం వైసీపీ నేతలవే
  • మీ పార్టీ వారే కేసులు వేస్తున్నారు
AP TDP Chief Kala Venkat rao fires on YS Jagan

రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న భూ కుంభకోణానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు తెలిపారు.  ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఇళ్ల పట్టాల పంపిణీని సూట్‌కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని, ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ కార్యకర్తలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 23 వేల ఎకరాల్లో అధికభాగం వైకాపా నేతలవేనని, దుర్మార్గంగా సేకరించిన భూముల స్వీకరణకు ప్రజలు సిద్ధంగా లేరని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూకుంభకోణంపై రిటైర్డ్ లేదంటే సిట్టింగ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై సొంతపార్టీ నేతలే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల బడుగు, బలహీనవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలల పాలనలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.

More Telugu News