అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి.. లొంగిపోయేందుకు రంగం సిద్ధం!

Maoist top leader Ganapathi ready to surrender
  • ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, డయాబెటిస్‌తో బాధపడుతున్న గణపతి
  • ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యమం వైపు
  • గణపతి తలపై కోటి రూపాయల నజరానా
మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు (74) లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో గత రెండేళ్లుగా బాధపడుతున్న గణపతిని ప్రస్తుతం మోసుకుని తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి లొంగిపోయి చికిత్స పొందడమే మేలని భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసు అధికారులు చొరవ తీసుకుంటున్నారని, మోదీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు.  

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌కు చెందిన గణపతి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత నక్సలైటు ఉద్యమంపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. 1977లో తొలిసారి ఆయనపై కేసు నమోదైంది. 1990-91లో పీపుల్స్‌వార్‌లో చీలికలు రావడంతో 2005లో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన గణపతి తలకు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న గణపతి స్థానంలో నంబాల కేశవరావును పార్టీ నియమించింది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.
Go Back to Shorts
Maoist
Ganapathi
Muppala Lakshmana Rao
Telangana

More Telugu News