LMWH: కరోనా రోగులకు ఊపిరి పోస్తోన్న రక్తాన్ని పలుచన చేసే మందు!

  • కరోనా రోగుల్లో గడ్డకడుతున్న రక్తం, రక్తనాళాల్లో వాపు
  • ఎల్ఎం డబ్ల్యూహెచ్ బాగా పనిచేస్తోందంటున్న వైద్యులు
  • చికిత్స ఆరంభం నుంచే ఈ తరహా మందులు ఇవ్వాలంటున్న నిపుణులు
Blood thinner medicine gives good results

సాధారణంగా వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టినప్పుడు రక్తాన్ని పలుచన చేసేందుకు ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ (లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్) ఔషధాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడీ ఔషధం కరోనా రోగుల చికిత్సలో ఆశాదీపంలా కనిపిస్తోంది. చర్మం కింది భాగంలో ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ ఔషధాన్ని రోగులకు అందిస్తారు. కరోనా రోగుల్లో 90 శాతం హఠాన్మరణాలను ఈ మందు నివారిస్తోందని వైద్యులు అంటున్నారు.

కరోనా రోగుల్లో రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉన్నందున దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని ప్రొఫైలాక్టిక్ థెరపీలో ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కరోనా డేటాను పరిశీలిస్తే... రక్తం గడ్డకట్టడం తరచుగా జరుగుతోందని, దీని కారణంగా గుండెపోటు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వస్తున్నాయని గుర్తించారు. అందుకే కరోనా రోగులకు చికిత్స ఆరంభం నుంచే ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ ఔషధాన్ని ఇవ్వడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్పటికే రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను, వాపులకు చికిత్స చేయడం కంటే కొత్తగా రక్తం గడ్డకట్టడం, కొత్తగా కలిగే వాపులను నివారించడం సులభమని డాక్టర్లు భావిస్తున్నారు.

More Telugu News