harshavardhan: ప్రజలు కరోనాను ఇంత తేలికగా తీసుకోవద్దు!: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

  • భారత్‌లో రికవరీ రేటు 76.28 శాతం
  • మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పం
  • దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు
  • కరోనా‌ వ్యాప్తి గురించి స్థానిక నాయకులు అవగాహన కల్పించాలి
harshavardhan on corona

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏకంగా 75 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, రికవరీల సంఖ్య అధికంగా ఉంటుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. రికవరీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రజలను కోరారు.

మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భారత్‌లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందని వివరించారు. దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్‌ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పారు. ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

More Telugu News