CBDT: భారత్ లోని లామాలకు డబ్బుతో ఎరవేసి.. దలైలామాపై చైనా గూఢచర్యం!

  • ఐటీ అధికారుల ఆధ్వర్యంలో రూ. 1000 కోట్ల నగదు బదిలీ కేసు
  • షెల్ కంపెనీలతో ఇండియాకు డబ్బులు తెచ్చిన చార్లీ పెంగ్
  • ఢిల్లీ టిబెటన్ కాలనీల్లోని లామాలకు డబ్బు పంపిణీ
  • చైనా కంపెనీల ప్రమేయం కూడా ఉందన్న సీబీడీటీ
China Spy on Dalailama with Hawala Money

సుమారు రూ. 1000 కోట్ల సీమాంతర నగదు బట్వాడా కేసును విచారిస్తున్న భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం ధర్మశాలలో ప్రభుత్వ అధీనంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా సమాచారాన్ని చేరవేసేందుకు చైనాకు చెందిన వ్యక్తి ఒకరు, ఢిల్లీలోని టిబెటన్ కాలనీ వాసులకు పెద్దమొత్తంలో లంచం ఇచ్చాడు.  

నిందితుడిని 42 ఏళ్ల చార్లీ పెంగ్ గా గుర్తించామని, ఢిల్లీలోని మజ్నూకా తిల ప్రాంతంలో అతను కొంతమంది లామాలకు డబ్బిచ్చాడని అధికారులు గుర్తించారు. పెంగ్ నుంచి డబ్బు తీసుకున్న వారు వాటిని కాలనీలోని లామాలకు చేరవేశారని, వీరంతా చైనాకు చెందిన వీ చాట్ యాప్ (ప్రస్తుతం దీన్ని భారత్ లో నిషేధించారు) ద్వారా సమాచారాన్ని పంచుకునేవారని అధికారులు వెల్లడించారు.

ఈ వారం ప్రారంభంలో అక్రమ నగదు లావాదేవీలు బయట పడగా, ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్ లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు దాదాపు రూ.70 లక్షల నగదును, కంప్యూటర్లను, డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అధికారులు సీజ్ చేసిన కంప్యూటర్లు, పత్రాల్లో పలువురు చైనీయుల పేర్లు, టిబెటన్ల పేర్లున్నాయని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ నకిలీ భారత పాస్ పోర్ట్ తో చార్లీ పెంగ్ ఇండియాలో సంచరించాడని, హవాలా ఫండ్స్ ను చైనా నుంచి ఇండియాకు చేర్చేందుకు తప్పుడు చిరునామాలతో కంపెనీలను సృష్టించాడని, మెడికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ తదితరాలను ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని మోసం చేశాడని అధికారులు తేల్చారు.

2018లో ఢిల్లీ పోలీసులు ఓ మారు చార్లీని అరెస్ట్ చేశారని, ఆపై బెయిల్ మీద బయటకు వచ్చిన అతను మణిపూర్ కు చెందిన మహిళను పెళ్లాడి, భారత పాస్ పోర్టును లువో సాంగ్ పేరిట పొందాడని సీబీడీటీ తన ప్రకటనలో పేర్కొంది. కొన్ని చైనా అనుబంధ సంస్థలకూ ఈ స్కామ్ లో భాగముందని స్పష్టం చేసింది. అయితే, సీబీడీటీ ఏ విధమైన పేర్లనూ వెల్లడించక పోవడం గమనార్హం.

More Telugu News