Kerala: శానిటైజర్ కోసం కక్కుర్తి పడ్డాడు.. సీసీ కెమెరాలు చూసి కంగుతిన్నాడు... 5 లక్షల వ్యూస్!

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • షాపుకెళ్లి శానిటైజర్ దొంగిలించిన యువకుడు
  • సీసీ కెమెరాలు చూసి మళ్లీ దానిలోకే ఒంపేసిన వైనం
Kerala Sanitiser Theft Goes Viral

తనకు కావాల్సిన దాని కోసం దొంగతనం చేయడానికి వెళ్లాడు. ఆపై పని పూర్తి చేసుకున్నాడు కూడా. కానీ, ఇంతలోనే అక్కడ సీసీ కెమెరాలు అమర్చి వున్నాయని గమనించాడు. ఎందుకొచ్చిన బాధలే అనుకుంటూ దొంగిలించిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కి, ఆ దొంగ చేసిన పని తెగ వైరల్ అయింది. ఏకంగా 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ అతను దొంగతనం చేసింది ఏమిటో తెలుసా? శానిటైజర్. మరిన్ని వివరాల్లోకి వెళితే...

అసలే కరోనా కాలం. నిత్యమూ చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న వేళ, కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. చేతులను శుభ్రపరచుకునేందుకు శానిటైజర్ లేదని భావించే వారు సమీపంలోని షాపుల వద్దకో లేదా సెలూన్ల వద్దకో వెళుతున్న వేళ, ఇతను మాత్రం విభిన్నంగా ఆలోచించి, ఓ బాటిల్ తీసుకుని, షాపుకు వెళ్లాడు. తాను తెచ్చుకున్న బాటిల్ లోకి దర్జాగా శానిటైజర్ ని నింపుకున్నాడు.

ఆపై వెళ్లిపోయే ముందు, ఎదురుగా సీసీ కెమెరా ఉందని గమనించాడు. క్షణం కూడా ఆలోచించకుండా, తన బాటిల్ లోని శానిటైజర్ ను అక్కడున్న మినీ బాటిల్ లో నింపేసి వెళ్లిపోయాడు. అప్పటివరకూ మాస్క్ తీసేసివున్న అతను, సీసీటీవీని చూడగానే, మాస్క్ వేసుకున్నాడు. దీన్ని గమనించిన షాపు యజమాని, దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు.

More Telugu News