JP Nadda: దోచుకోవడం కోసమే కాళేశ్వరం పనులను రూ. 85 వేల కోట్లకు పెంచారు: కేసీఆర్ పై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు

  • తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
  • రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదు
  • నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
JP Nadda fires on KCR

టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. దోచుకోవడం కోసమే రూ. 45 వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం పనులను రూ. 85 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. గత ఆరేళ్లుగా రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమాల సందర్భంగా ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పిన కేసీఆర్... నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నడ్డా నిలదీశారు. ఏడు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని... కానీ, 50 వేల నిర్మాణాలు కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

More Telugu News