Esther: శ్రీవారి దర్శనానికి వచ్చి చిక్కుకుపోయిన రష్యన్ యువతి... ముందుకొచ్చిన మానవతా వాదులు

  • తల్లితో కలిసి భారత్ వచ్చిన ఎస్తర్
  • కరోనా లాక్ డౌన్ తో తిరుపతిలో నిలిచిపోయిన వైనం
  • చేతిలో డబ్బులేక తీవ్ర ఇబ్బందులు
Russian woman stranded in Tirupathi due to corona situations

రష్యా దేశానికి చెందిన ఎస్తర్ అనే యువతి తన తల్లి ఒలీవియాతో కలిసి కొంతకాలం కిందట భారత్ వచ్చారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఎస్తర్ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తిరుపతిలో చిక్కుకుపోయింది. చేతిలో ఉన్న డబ్బంతా కొన్నిరోజుల్లోనే ఖర్చయిపోయింది. దాంతో, ఉత్తరభారతదేశంలోని బృందావనంలో ఉన్న తల్లిని కలుసుకోలేక, రష్యా ఎలా వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోయింది. అయితే ఆమె పరిస్థితి పట్ల ఓ దినపత్రికలో వచ్చిన కథనం మానవతా వాదులను కదిలించింది.

హైదరాబాదుకు చెందిన మారం ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అధిపతి సతీశ్ రూ.25 వేలు, తిరుపతిలో పనిచేస్తున్న ఏపీ ట్రాన్స్ కో అధికారి రూ.10 వేలు అందజేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫోన్ ద్వారా ఎస్తర్ తో మాట్లాడి ఆమె ఇబ్బందులను తెలుసుకున్నారు. తన పీఏ ద్వారా రూ.10 వేలు పంపడమే కాకుండా, బృందావనంలో ఉన్న ఆమె తల్లి ఒలీవియాను తిరుపతి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి రష్యన్ యువతి ఎస్తర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్తర్ తనకు సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది.

More Telugu News