Mayawati: కాంగ్రెస్ కు షాకిచ్చిన మాయావతి... రాజస్థాన్ బలపరీక్షలో మద్దతివ్వద్దని తన ఎమ్మెల్యేలకు ఆదేశం!  

  • రాజస్థాన్ లో బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటువేయాలని విప్ జారీ
  • సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటున్న బీఎస్పీ
BSP Decide Not toSupport Congressin Rajasthan

రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు క్షణానికో మారు మారిపోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవ్వాలని అశోక్ గెహ్లాట్ యోచిస్తున్న వేళ, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, వారంతా ఇప్పటివరకూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే, ఆరుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ విప్ జారీ చేసింది.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. నాటి పరిస్థితుల నేపథ్యంలో జరిగిన పరిణామాలను పార్టీ  అధినేత్రి మాయావతి పెద్దగా పట్టించుకోలేదు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించినా, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మిన్నకున్నారు. ఈ విషయంలో సాంకేతికాంశాలు అడ్డంకులను సృష్టించినా, ఆ ఆరుగురూ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.

 ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా, ఆ ఆరుగురినీ బీఎస్పీ ఎమ్మెల్యేలుగానే పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆమె కోరారు. అప్పట్లో అది స్పీకర్ నిర్ణయాధికారమేనని, తాము జోక్యం చేసుకోలేమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఆమె, రాజస్థాన్ లో బీఎస్పీ టికెట్ పై నెగ్గిన ఆర్.గుధా, లఖన్ సింగ్, దీప్ చంద్, జేఎస్ అవానా, సందీప్ కుమార్, వాజబ్ అలీలకు విప్ జారీ చేసింది.

ఈ విషయాన్ని వెల్లడించిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా, ఆరుగురు ఎమ్మెల్యేలకు విడివిడిగా నోటీసులు కూడా పంపామని అన్నారు. బీఎస్పీ జాతీయ పార్టీ అని, ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ ఎవరితోనూ విలీనం కాలేదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో మరేదైనా పార్టీలో బీఎస్పీ విలీనం అయితే మాత్రమే రాష్ట్రాల పరిధిలో విలీనం అమలవుతుందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న అసెంబ్లీని సమావేశ పరచాలని రెండోసారి విన్నవించింది. ప్రస్తుతం సమావేశాలు జరిగితే, 19 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అమలవుతుంది. వారంతా కోర్టును ఆశ్రయించి ఉండటంతో కోర్టులో విషయం తేలేంత వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించరాదని గవర్నర్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News