Rajasthan: సుప్రీం విచారణకు గంటల ముందు... సచిన్ పైలట్ పై కేసు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్!

  • సమస్యను పార్టీలోనే పరిష్కరించుకుందాం
  • అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ సీనియర్లు
  • కోర్టులోనే తేల్చుకుందామంటున్న కొందరు
Rajasthan Congress Thinks to Withdraw Petition in Supreem Court

రాజస్థాన్ సంక్షోభ కేసును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. నేడు సుప్రీం కోర్టులో సచిన్ పైలట్ వర్గం అనర్హతపై కేసు విచారణకు రానున్న నేపథ్యంలో, ఈ కేసు పిటిషన్ ను వెనక్కు తీసుకుని, సమస్యను అంతర్గతంగానే పరిష్కరించుకుందామని ఓ వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం కోర్టులోనే తేల్చుకుందామని అంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలోగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

గత వారంలో కాంగ్రెస్ రెబల్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించి, తాత్కాలిక ఉపశమనాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను చాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ అధికారాలు నిర్ణయించేంత వరకూ సచిన్ పైలట్ వర్గంపై ఏ విధమైన చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి, బలాన్ని నిరూపించుకోవాలని గెహ్లాట్ వర్గం తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అడ్డుకుని, అసెంబ్లీ సమావేశమయ్యేందుకు అంగీకరించలేదు. 

హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై పిటిషన్ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరచలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసును విత్ డ్రా చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు.

More Telugu News