Chittoor District: ట్రాక్టర్ కొనేందుకు నగలు అడిగిన భర్త.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భార్య, అత్త!

  • బెంగళూరులో క్యాబ్ నడుపుకుని జీవిస్తున్న గోపీనాథ్‌రెడ్డి
  • లాక్‌డౌన్ కారణంగా వాయిదాలు కట్టకపోవడంతో కారును వెనక్కి తీసుకున్న ఫైనాన్స్ కంపెనీ
  • నాలుగు నెలల క్రితం చిత్తూరులోని అత్తగారింటికి
wife killed Husband with cricket bat in Chittoor

ఉన్న బతుకుదెరువు పోవడంతో ట్రాక్టర్ కొనుక్కుని ఉపాధి చూసుకోవాలని భావించిన ఓ వ్యక్తి అందుకోసం భార్య నగలు అడిగి ఆమె చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36) అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత (32)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 9 ఏళ్ల కుమారుడున్నాడు. కొన్నేళ్ల క్రితం గోపీనాథ్‌రెడ్డి బెంగళూరు వెళ్లి క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం గ్రామానికి వచ్చిన గోపీనాథ్ అత్తగారింట్లో ఉంటున్నాడు.

చేతిలో డబ్బులు లేక వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ అతడి కారును తీసుకెళ్లిపోయింది. దీంతో ఉపాధి కోసం ట్రాక్టర్ కొనుక్కోవాలని గోపీనాథ్ భావించాడు. అందుకోసం నగలు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. మంగళవారం మరోమారు నగల విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, ఆమె తల్లి క్రికెట్ బ్యాట్, రోకలితో అతడిపై దాడిచేసి చితకబాదారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News