Keeravani: ప్రభాస్ సినిమాకి మరోసారి కీరవాణి సంగీతం?

  • 'బాహుబలి' సీరీస్ కి పనిచేసిన కీరవాణి 
  • తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 
  • సంగీతానికి చిత్రంలో అధిక ప్రాధాన్యత
  • కీరవాణితో ప్రస్తుతం సంప్రదింపులు
Keeravani to work for Prabhas film again

ప్రభాస్ నటించిన 'బాహుబలి' సీరీస్ కి అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి.. మరోసారి ఆయన చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంగీతం పరంగా కూడా చాలా ప్రాధాన్యత వుందట. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న కీరవాణిని తీసుకుంటే చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ క్రమంలో తాజాగా కీరవాణితో ఈ విషయంలో సంప్రదింపులు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఆయన కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు, దాంతో సానుకూలంగా స్పందిస్తున్నట్టు చెబుతున్నారు. మరోపక్క, ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఫిక్స్ చేసుకుందామని అనుకున్నప్పటికీ, ఆమె భారీ స్థాయిలో పారితోషికం అడగడంతో, ప్రస్తుతం కియరా అద్వానీ పట్ల దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.  

More Telugu News