Bihar: కరోనా సమయంలో ఇంత భయానకం మరెక్కడైనా ఉందా? వీడియో పోస్ట్ చేసిన శత్రుఘ్న సిన్హా

  • బీహార్ లోని ఓ ఆసుపత్రిలో వేచి చూస్తున్న రోగులు
  • వందల మంది కనీస భౌతిక దూరంలో లేని పరిస్థితి
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న శత్రుఘ్న సిన్హా
Shatrughan Sinha Video goes Viral

"భయానకం... బీభత్సం. ఈ వీడియో బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లోనిది. దీన్ని ఏమని, ఎలా అనాలి? కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమిది. నేను ఎవరినీ తప్పుబట్టాలని భావించడం లేదు. కరోనా మహమ్మారి ఎంతో విజృంభిస్తున్న ఈ రోజుల్లో, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఓపీడీలో ఈ జనసంద్రాన్ని చూడండి. లాక్ డౌన్ నిబంధనలన్నీ ఎక్కడికి పోయాయి? ఇటువంటి సమయాల్లోనే వైరస్ మరింతమందికి సంక్రమిస్తుంది. ఎంతో మంది పేషంట్లకు, వారికి సహాయకులుగా వచ్చిన వారికి కూడా ప్రమాదమే. అందరి సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అంటూ మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో ఆసుపత్రి ఓపీడీ విభాగంలో తలుపులు తీస్తే లోపలికి వెళ్లేందుకు వేచి చూస్తున్న వందలాది మంది కనిపిస్తున్నారు. వారి మధ్య ఏ మాత్రమూ భౌతిక దూరం లేదు. ఒకవేళ ఎవరైనా దూరం జరిగి వెళ్లాలన్నా, చాలినంత స్థలం కూడా అక్కడ కనిపించడం లేదు. కాగా, బీహార్ లో కరోనా శరవేగంగా విజృంభిస్తుండడంతో, ఈ నెల 31 వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు.

More Telugu News