Supriya: అంధుడ్ని బస్సు ఎక్కించేందుకు రోడ్డుపై పరుగులు తీసిన మహిళ... సర్ ప్రైజ్ ఇచ్చిన యాజమాన్యం

  • అంధుడ్ని బస్సు ఎక్కించేందుకు మహిళ ప్రయత్నం
  • బస్సును ఆపేందుకు పరుగులు
  • ఆమెకు కొత్త ఇంటిని బహూకరించిన జోయ్ అలుక్కాస్
Women who helps a blind man was gifted surprisingly

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. కేరళలో ఓ అంధుడ్ని బస్సు ఎక్కించేందుకు ఓ మహిళ పరుగులు తీసి బస్సును ఆపింది. ఆపై అంధుడ్ని బస్సు ఎక్కించింది. ఓ మహిళ అయినా అంధుడి కోసం రోడ్డుపై పరుగులు తీసిన ఆమె మానవతకు అందరూ ముగ్ధులయ్యారు. ఇది ఇటీవలే జరిగింది.

ఆ మహిళ పేరు సుప్రియ. జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో సేల్స్ ఉమన్ గా పనిచేస్తోంది. తమ ఉద్యోగిని బస్సును ఆపేందుకు పరుగులు తీసి, ఓ దివ్యాంగుడికి సాయం చేసిన వైనం వీడియో ద్వారా చూసిన నగల దుకాణం చైర్మన్ జోయ్ అలుక్కాస్ ఎంతో ఆనందించారు. సుప్రియను అభినందించేందుకు వెళ్లిన జోయ్ అలుక్కాస్ ఆమె ఎంతో చిన్నదైన అద్దె ఇంట్లో జీవిస్తుండడం చూసి బాధ పడ్డారు. దాంతో, ఆమెకు ఓ కొత్త ఇల్లు కొనిచ్చేందుకు ఆ క్షణమే నిర్ణయించుకున్నారు.

అయితే ఆ విషయం చెప్పకుండా, త్రిసూర్ లోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు. భర్తతో కలిసి జోయ్ అలుక్కాస్ కార్యాలయానికి వెళ్లిన సుప్రియకు చైర్మన్ నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చారు. కొత్త ఇంటి తాలూకు పత్రాలను ఆమెకు అందిస్తుండగా, వందల సంఖ్యలో ఉద్యోగులు కరతాళ ధ్వనులతో అభినందిస్తుండగా, సుప్రియ విస్మయానికి గురైంది. తాను ఆనాడు అంధుడి విషయంలో కావాలని చేసిందేమీ లేదని, తన మనసుకు తోచిన విధంగా చేశానని, ఆ సాయం ఇంత గుర్తింపు తెస్తుందని అనుకోలేదని సుప్రియ పేర్కొంది .


More Telugu News