Sonu Sood: ఇటీవలి అనుభవాలపై ఓ పుస్తకం రాస్తాను: సినీనటుడు సోనూసూద్

  • చాలా మంది వలస కార్మికులతో మాట్లాడానన్న సోను
  • నా పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుంది
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడున్నర నెలలు గొప్ప అనుభవాలు
  • కార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడిపాను
sonu sood going to write a book

సినీనటుడు సోనూసూద్ ఓ పుస్తకం రాయనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆయన తన సొంత డబ్బులతో సొంత గ్రామాలకు పంపిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.

ఆయన చాలా మంది వలస కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించారు. కార్మికులతో మాట్లాడిన అనుభవాలతో ఆయన పుస్తకం రాస్తానని చెప్పారు. దీన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందని వివరించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూడున్నర నెలలు తనకు జీవితాన్ని మార్చే అనుభవాలు మిగిలాయని ఆయన చెప్పారు. తాను ఆ కార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడిపానని, ఆ సమయంలో వారి బాధల గురించి తెలుసుకున్నానని చెప్పారు.

వారు తిరిగి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో వారిని చూసి తాను ఎంతో సంతోషించానని తెలిపారు. వారి ముఖాల్లో చిరునవ్వులు చూడడం తన జీవితంలో ప్రత్యేకమైన అనుభవాన్ని మిగిల్చిందన్నారు. వలస కార్మికులందరూ ఇంటికి వెళ్లేవరకు తాను తన సేవలను కొనసాగిస్తానని చెప్పానని గుర్తు చేశారు.

వారికి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు తాను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పలు రాష్ట్రాల వలస కార్మికులతో తన అనుభవాలను శాశ్వతంగా పొందుపర్చడానికి తాను వారి వాస్తవ  కథలను ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తానని చెప్పారు.

More Telugu News