Corona Virus: ఏపీలో కరోనా ఉగ్రరూపం... రికార్డు స్థాయిలో 43 మంది మృతి

Corona sounds death bells in Andhra Pradesh
  • అత్యధికంగా అనంతపురం జిల్లాలో 10 మంది బలి
  • రాష్ట్రంలో 408కి చేరిన కరోనా మరణాలు
  • 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు
కరోనా మహమ్మారి తీవ్రతకు ఏపీ గజగజ వణికిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుండడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 43 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది మరణించడం ఇదే ప్రథమం.

అనంతపురం జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 408కి పెరిగింది.

అటు, రాష్ట్రవ్యాప్తంగా మరో 1,916 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తమ్మీద పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కి పెరిగింది. తాజాగా, 952 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 15,144 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Death
Andhra Pradesh
Positive
COVID-19

More Telugu News