మాస్క్ ధరించమంటే పద్మారావు పట్టించుకోలేదు... తర్వాత కరోనా వచ్చింది: కేటీఆర్

KTR says Padmarao denied to wear a mask
  • కరీంనగర్ జిల్లా హరితహారంలో పాల్గొన్న కేటీఆర్
  • కరోనా ఎవరికైనా వస్తుందని వెల్లడి
  • కరోనా మరణాల కంటే లాక్ డౌన్ మరణాలే ఎక్కువని వ్యాఖ్యలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా ఎవరికైనా వస్తుందని అన్నారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆ కార్యక్రమానికి పద్మారావు మాస్కు లేకుండా వచ్చారని వెల్లడించారు. మాస్కు ధరించమంటే పద్మారావు పట్టించుకోలేదని, ఆ మరుసటి రోజే ఆయన కరోనాకు గురయ్యారని కేటీఆర్ వివరించారు.

ఇక తెలంగాణలో కరోనా కట్టడి చేయలేకపోతున్నారంటూ వస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కరోనా మరణాల కంటే దేశంలో లాక్ డౌన్ మరణాలే ఎక్కువగా ఉంటాయని పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్ద దేశాలే కరోనాను కట్టడి చేయలేక చేతులు ఎత్తేశాయని అన్నారు. కరోనాపై విఫలమయ్యారన్న విమర్శలు పైశాచిక ఆనందం కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు చేయడం వల్ల కరోనా యోధులను నిరుత్సాహపర్చినట్టు అవుతుందని తెలిపారు. అయితే ఇది సరైన సందర్భం కాదని తాము కేంద్రంపై విమర్శలు చేయడంలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
KTR
Padmarao
Mask
Corona Virus
Haritha Haram
Telangana

More Telugu News