Andhra Pradesh: చంద్రబాబు ట్వీట్ కు వెంటనే బదులిచ్చిన ఏపీ సర్కారు

  • కరోనా టెస్టుల సంఖ్యపై చంద్రబాబు అనుమానం
  • టెస్టులు చేయించుకోకపోయినా సందేశాలు వస్తున్నాయని వెల్లడి
  • ప్రజలు ఇచ్చిన నెంబర్ కే సందేశం వెళుతుందన్న సర్కారు
AP Helath Ministry replies to Chandrababu tweet

ఏపీలో కరోనా టెస్టుల గణాంకాలు అన్నీ మాయ అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. కరోనా టెస్టులు చేయించుకోని వాళ్లకు కూడా రిజల్ట్ గురించి ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఏపీ సర్కారు వెంటనే స్పందించింది.

కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఫలితాలతో కూడిన ఎస్సెమ్మెస్ వెళుతుందని  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ కే ఎస్సెమ్మెస్ వెళుతుందని వివరించింది. కరోనా టెస్టుల ఫలితాలను సత్వరమే తెలియజేసి ప్రజల్లో భయాందోళనలు తగ్గించడానికి వీలుగా వినూత్నరీతిలో ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే, ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో సరైన పద్ధతి అనిపించుకోదని హితవు పలికింది.

More Telugu News