Rehana fathima: ఇక క్వార్టర్స్‌ను ఖాళీ చేయండి: వివాదాస్పద సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు బీఎస్ఎన్ఎల్ ఆదేశాలు

  • శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి వెలుగులోకి వచ్చిన ఫాతిమా
  • ఇటీవల కుమారుడు, కుమార్తెతో కలిసి అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్
  • ఉద్యోగ పదవీ కాలం ముగిసినా క్వార్టర్స్ ఖాళీ చేయని ఫాతిమా
Rehana Fathima to vacate quarters

కొచ్చిలో తానుంటున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు బీఎస్ఎన్ఎల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నెల 27న నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది మే 11తో ఆమె ఉద్యోగ కాలం ముగిసినందున, ఆమె ఇప్పుడు బీఎస్ఎన్ఎల్‌లో భాగం కాదని, కాబట్టి ఆ తర్వాత ఆమె ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉండేందుకు అనర్హురాలని ఆ నోటీసులో పేర్కొంది.

కాగా, ఇప్పటికే రెహానాపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమారుడు, కుమార్తెతో కలిసి తన అర్ధ నగ్న శరీరంపై పెయింట్ వేయించుకున్న రెహానా అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

2018లో శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత రెహానా ఫాతిమా వెలుగులోకి వచ్చారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పాప్యులర్ అయ్యారు. ఆ తర్వాత హిందువులపై సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ఈ  క్రమంలో 18 రోజులపాటు రెహానా జైలు శిక్ష కూడా అనుభవించారు.

More Telugu News