Private Trains: 2023 నాటికి దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులు

  • రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ కు ఆహ్వానాలు పలికిన భారత రైల్వే
  • ఐదు శాతం ప్రైవేటు రైళ్లు ఉంటాయని వెల్లడి
  • మేకిన్ ఇండియా పాలసీ ప్రకారం బోగీల తయారీ
Indian Railways invites RFQ for private trains

సుదీర్ఘ చరిత్ర కలిగిన, అత్యంత భారీ నెట్ వర్క్ ఉన్న భారతీయ రైల్వే ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 109 జతల రైలు మార్గాల్లో ప్రైవేటు రైళ్లు నడిపే ఆసక్తి ఉన్న భాగస్వాముల కోసం రైల్వే శాఖ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ను ఆహ్వానించింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి, ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయం పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. 2023 ఏప్రిల్ నాటికి దేశంలో ప్రైవేటు రైళ్లు కూత పెడతాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు.

ఈ రైళ్లు టెక్నాలజీ పరంగా ఎంతో ఆధునికంగా ఉంటాయని, వేగంగా ప్రయాణిస్తాయని తెలిపారు. అయితే, భారతీయ రైల్వే ప్రైవేటు పరం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీకే యాదవ్ మాట్లాడుతూ, ఇప్పటికే 2800 ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయని, వాటితో పోల్చితే ప్రైవేటు రైళ్లు 5 శాతం మాత్రమేనని అన్నారు. ఈ రైళ్లలో బోగీలను మేకిన్ ఇండియా విధానంలో భారత్ లోనే తయారుచేస్తారని వెల్లడించారు.

ధరల విషయానికొస్తే, ప్రస్తుతం ఎయిర్ లైన్స్, బస్ ఆపరేటర్లు ఎలాంటి పోటీ ధరలతో నడిపిస్తున్నారో, ఈ ప్రైవేటు రైళ్లలోనూ అదే తరహాలో టికెట్ రేట్లు ఉంటాయని వివరించారు. ఇప్పటికే దేశంలో ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్ పేరుతో ఐఆర్ సీటీసీ భాగస్వామ్యంతో ప్రైవేటు రైలు నడుస్తోంది.

More Telugu News