Jeevan Reddy: వారిద్దరి మరణాలకు ఎవరిది బాధ్యత? కేసీఆర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • వారం రోజుల నుంచి కరోనా టెస్టులు చేయడం లేదు
  • ఇద్దరు పేషెంట్లు కరోనా మరణవాంగ్మూలం ఇచ్చి చనిపోయారు
  • కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది
Jeevan reddy demands KCRs resignation

వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా టెస్టులను నిలిపేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇద్దరు వ్యక్తులు కరోనా మరణవాంగ్మూలాన్ని ఇచ్చి మృతి చెందారని... దేశంలో ఇలాంటి దుస్థితి ఎక్కడా లేదని అన్నారు. మానవహక్కుల కమిషన్ ఈ ఘటనలను సుమోటోగా తీసుకుని, విచారణ చేపట్టాలని  కోరారు.

వైద్య సాయం అందక ఇద్దరు వ్యక్తులు మరణవాంగ్మూలంతో చనిపోతే... రాష్ట్ర ఆరోగ్యమంత్రి సెల్ఫీ వీడియోను తప్పుబడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎంత క్షోభ పడ్డారోనని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. చెస్ట్ ఆసుపత్రిలో పని చేస్తున్న హెడ్ నర్సు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని... నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి... రోగులకు పరీక్షలు, వైద్య సదుపాయాలను కల్పించాలని జీవన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాలకు భరోసాలేని పరిస్థితి నెలకొందని... ప్రజలకు హోం క్వారంటైన్ ఒకటే చికిత్స అని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

More Telugu News