Jammu And Kashmir: అనంత్ నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఐదేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల హతం

Two Terrorists killed in Anantnag encounter
  • వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్
  • ఈ నెలలో ఇప్పటి వరకు 36 మంది ఉగ్రవాదుల హతం
  • ఏడాది 116 మందిని హతమార్చిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 26న వీరు జరిపిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ శ్యామల్ కుమార్‌తోపాటు ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు.

భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 14 ఎన్‌కౌంటర్లు జరగ్గా 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, ఈ ఏడాది ఇప్పటి వరకు 116 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
Jammu And Kashmir
anantnag
Encounter
Terrorists

More Telugu News