India: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా, జపాన్ సంయుక్త విన్యాసాలు!

  • హిందూ మహాసముద్రంలో వార్ షిప్పులతో సంయుక్త విన్యాసాలు
  • పలు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా
  • జాయింట్ ఫ్రంట్ గా యూఎస్, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా ఏర్పడే అవకాశం
India and Japan navies conduct exercise in Indian Ocean

భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండో-చైనా వాస్తవాధీనరేఖ వద్ద ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించాయి. ఒక్క ఇండియాతోనే కాకుండా చైనా పలు దేశాలతో కయ్యం పెట్టుకుంటోంది. జపాన్ తో సైతం ఇటీవలి కాలంలో ఘర్షణ వైఖరిని అవలంబిస్తుండటంతో... ఆ దేశం తన నేవీని బలోపేతం చేసింది.

చైనాతో సమస్యలు ఉన్న నేపథ్యంలో భారత్, జపాన్ దేశాలు హిందూ మహాసముద్రంలో వార్ షిప్పులతో సంయుక్త విన్యాసాలను నిర్వహించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, హిందూ సముద్ర జలాల్లో చైనా కుటిల చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో... ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు ఒక జాయింట్ ఫ్రంట్ గా ఏర్పడే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో, భారత్, జపాన్ దేశాలు నావికాదళ విన్యాసాలను నిర్వహించడం గమనార్హం. చైనాకు ఒక హెచ్చరికను జారీ చేసే క్రమంలోనే ఈ విన్యాసాలు చోటు చేసుకున్నాయి.

భారత్ కు చెందిన ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులీశ్...జపాన్ కు చెందిన జేఎస్ కషిమా, జేఎస్ షిమయుకిలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి. గత మూడేళ్లలో ఇరు దేశాలు కలిసి సంయుక్త విన్యాసాలను నిర్వహించడం ఇది 15వ సారి. వ్యూహాత్మక చర్యల్లో భాగంగానే విన్యాసాలను నిర్వహించామని జపాన్ రాయబారి సతోషి సుజుకి ఈ సందర్భంగా తెలిపారు.

గతంలో చైనాతో డోక్లాం స్టాండాఫ్ సమయంలో కూడా భారత్ కు జపాన్ మద్దతుగా నిలిచింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తంగా ఉంది. సముద్ర జలాల్లో చైనా కుటిల యత్నాలకు ఒడిగడితే తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉంది. మరోపక్క, సెంకకు దీవులకు సంబంధించి జపాన్, చైనాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ దీవులకు సమీపంలోని జపాన్ సముద్ర జలాల్లోకి చైనీస్ కోస్ట్ గార్డ్ వెస్సెల్స్ పలుమార్లు చొచ్చుకెళ్లాయి.

ఈ సందర్భంగా చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనం ఉద్రిక్తతలను మరింత పెంచేదిలా ఉంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లో జులై 5 నుంచి తమ నేవీ మిలిటరీ ఎక్సర్ సైజ్ లను నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ శత్రు దేశాలకు హెచ్చరికలు జారీ చేసేందుకే వీటిని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More Telugu News