Corona Virus: రాందేవ్ బాబా కరోనా మందుకు ఆదిలోనే ఆటంకం... ఏడు రోజుల్లో ఎలా నయం చేస్తుందో నిరూపించాలన్న కేంద్రం!

  • నిన్న కరోనా కిట్ ను విడుదల చేసిన రాందేవ్ బాబా
  • వైరస్ ను 100 శాతం అడ్డుకుంటుందని ప్రకటన
  • క్లినికల్ ట్రయల్స్, అనుమతుల వివరాలు వెంటనే సమర్పించండి
  • కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు
  • సమాచార లోపమేనన్న బాలకృష్ణ
Patanjali Asked By Ayush Ministry To Explain COVID Drug Claim

ఆయుర్వేద ఉత్పత్తులతో తాము కరోనాకు ఔషధాన్ని తయారు చేశామని, ఇది వారం రోజుల్లోనే శరీరంలోని వైరస్ ను పారద్రోలుతుందని చెబుతూ యోగా గురువు బాబా రాందేవ్ విడుదల చేసిన 'కరోనిల్ అండ్ శ్వాసరి'లను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. తక్షణం ఈ కరోనా కిట్ ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

 కాగా, ఈ ఔషధాలను పతంజలి ఆయుర్వేద రీసెర్చ్ చేసి తయారు చేసిందని, దేశవ్యాప్తంగా 280 మంది రోగులపై పరిశీలించిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేశామని, దీని ధర రూ. 545 అని రాందేవ్ బాబా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. రాందేవ్ మీడియా మీట్ ముగియగానే, ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ ఔషధాల్లో కంపోజిషన్ నుంచి, రీసెర్చ్ ఫలితాలు, ఏఏ ఆసుపత్రుల్లో ఎవరిపై వాడారన్న వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది.

క్లినికల్ ట్రయల్స్ చేసే ముందు ఔషధాన్ని రిజిస్టర్ చేశారా? అని ప్రశ్నించిన ఆయుష్, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ నుంచి వచ్చిన క్లియరెన్స్ పత్రాలను పంపాలని కోరింది. వారం రోజుల్లోగా వైరస్ ను ఈ ఆయుర్వేద మందు తరిమేస్తుందని చెప్పడానికి గల నిదర్శనాలను కూడా అందించాలని ఆయుష్ శాఖ కోరింది. పతంజలి ఈ ప్రొడక్ట్ ను విడుదల చేసిన గంటల వ్యవధిలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఔషధం అధ్యయనానికి సంబంధించిన ఎటువంటి వివరాలూ తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ఈ ప్రొడక్టుకు వచ్చిన లైసెన్స్, వివిధ విభాగాల నుంచి వచ్చిన అనుమతుల వివరాలను పంపాలని కూడా ఆదేశించింది.

కాగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటనపై స్పందించిన పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ, తమ ఔషధం 100 శాతం అన్ని నియమ నిబంధనలకు లోబడే తయారు చేయబడిందని స్పష్టం చేశారు. ప్లాసిబో నియంత్రిత క్లినికల్ ట్రయల్స్ ను రాండమ్ గా నిర్వహించామని, ఈ వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖకు అప్పగించామని తెలిపారు. ఆయుర్వేదానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంతో తోడ్పాటును ఇస్తోందని, కేవలం సమాచారలోపం కారణంగానే తమ ఔషధానికి అడ్డంకులు ఏర్పడ్డాయని తెలిపారు.

ఇదిలావుండగా, పతంజలి ఆయుర్వేద విడుదల చేసిన కరోనా కిట్ పై రాజస్థాన్, హ్యానాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. రాందేవ్ బాబా ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని, ఐసీఎంఆర్ అనుమతి లేకుండా కరోనాకు ఔషధమంటూ ఎలా విడుదల చేస్తారని కొందరు ఫిర్యాదులు చేశారు. కరోనాకు ఇంతవరకూ డ్రగ్స్ కనుగొనబడలేదని,  ఈ ఆయుర్వేద మందులు కరోనా వైరస్ ను తరిమేస్తాయనడానికి సైంటిఫిక్ ఆధారాలు లేవని ఆరోపించారు.   అటువంటిది వారం రోజుల్లోనే ఈ కిట్ కరోనాను ఎలా నయం చేస్తుందని ఫిర్యాదిదారులు ప్రశ్నించడంతో పోలీసు కేసులు నమోదయ్యాయి.

కాగా, "ప్రపంచం మొత్తం కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కోసం వేచి చూస్తున్న ఈ తరుణంలో మేము గర్వంగా ప్రకటిస్తున్నాం. తొలిసారిగా ఆయుర్వేదంలో, ఎంతో రీసెర్చ్ చేసి ఔషధాన్ని తయారు చేశాం. క్లినికల్ ట్రయల్స్ ఆధారిత సాక్ష్యాలతో ఇది కరోనాను పారద్రోలుతుందని చెబుతున్నాం. నిమ్స్, పతంజలి రీసెర్చ్ సెంటర్లు దీన్ని సంయుక్తంగా తయారు చేశాయి. తొలి క్లినికల్ ట్రయల్స్ ను ఢిల్లీ, అహ్మదాబాద్ తో పాటు ఎన్నో నగరాల్లో చేశాం. 100 శాతం రికవరీ నమోదైంది. ఈ ఔషధంతో కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చు" అంటూ నిన్న రాందేవ్ బాబా కరోనా కిట్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News