Corona Virus: అగ్ర రాజ్యాలు అవస్థలు పడుతున్న వేళ... కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామంటున్న నైజీరియా సైంటిస్టులు!

  • వాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న 120కి పైగా దేశాలు
  • కనుగొన్నామన్న అడిలెక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు
  • మరిన్ని ట్రయల్స్ చేయనున్నామన్న సైంటిస్టులు
Corona Vaccine Developed by Nigeria

అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, జర్మనీ, చైనా తదితర ఎన్నో దేశాలకు చెందిన 120కి పైగా కంపెనీలు, ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి పరిశోధనలు సాగిస్తున్న వేళ, నైజీరియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం దీన్ని కనుగొన్నదని స్థానిక మీడియా ప్రకటించింది. అడిలెక్ యూనివర్శిటీలోని మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ ఎక్స్ పర్ట్ డాక్టర్ ఒడడిపో కొలవోల్ ఈ విషయాన్ని వెల్లడించారని 'ది గార్డియన్ నైజీరియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆయన నేతృత్వంలోనే వాక్సిన్ ను ఆఫ్రికన్ల కోసం అభివృద్ధి చేశారని తెలిపింది.

ఈ వ్యాక్సిన్ ను ఎవరైనా వినియోగించవచ్చని, ఇదేమీ నకిలీ వ్యాక్సిన్ కాదని, శాస్త్రవేత్తల అంకిత భావానికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. ఈ ఇంజెక్షన్ అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ చేస్తున్నామని, అధికార వర్గాల నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.

ఆఫ్రికా మొత్తం విస్తృతంగా వెతికి సార్స్ కోవ్-2 జీనోమ్ ను గ్రహించి, ఎన్నో ప్రయోగాలు చేశామని, శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు.

More Telugu News