Gorrekunta: వరంగల్ గొర్రెకుంట బావి హత్యల కేసులో చార్జిషీట్ దాఖలు

  • ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక
  • మృతుల శరీరాల్లో నిద్రమాత్రల ఆనవాళ్లు
  • ఊపిరితిత్తుల్లో నీరు చేరినందునే మరణించినట్టు నిర్ధారణ
Police files charge sheet in Gorrekunta mass murders case

కొన్నివారాల కిందట వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలోని గొర్రెకుంట బావిలో 9 శవాలు కనిపించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక్కడే ఇన్ని హత్యలు చేశాడన్న నిజం తెలిసి అందరూ నివ్వెరపోయారు. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే పట్టుకుని రిమాండ్ కు తరలించారు. ఓ హత్యను కప్పిపుచ్చడానికే ఇన్ని హత్యలు చేయాల్సివచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడి కావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

వరంగల్ సీపీ మాట్లాడుతూ, ఘటన జరిగిన 30 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశామని వెల్లడించారు. గత నెల 20న జరిగిన ఈ సామూహిక హత్యల కేసులో ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చిందని తెలిపారు. కాగా, బావిలో శవాలై తేలిన 9 మంది శరీరాల్లో నిద్రమాత్రల ఆనవాళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తొమ్మిది మంది అపస్మారక స్థితిలో ఉండగానే నిందితుడు బావిలో పడేసినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే వారందరూ చనిపోయినట్టు నిర్ధారించారు. దాంతో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ఒక్కడే అన్ని హత్యలూ చేసినట్టు పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు.

More Telugu News