Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు.. అరెస్ట్ చేసే అవకాశం?

  • మునిసిపల్ కౌన్సిల్ హాల్ నుంచి తన తాత ఫొటో మార్చినందుకు అయ్యన్న నిరసన
  • తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదు
  • కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు?
Nirbhaya case against TDP Leader Ayyanna patrudu

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మునిసిపల్ కమిషనర్ టి. కృష్ణ‌వేణి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన అయ్యన్న.. తన తాత ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ రెండు రోజుల క్రితం మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా అయ్యన్న తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని కమిషనర్ తోట కృష్ణవేణి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 క్రింద  కూడా కేసు నమోదు చేసినట్టు  స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అలాగే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయ్యన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Telugu News