Telangana: తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా... అధికారుల అత్యవసర సమావేశం!

  • వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు
  • గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్
  • తక్షణ చర్యలపై అధికారుల చర్చ
Corona Positive for 31 doctors in Telangana

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ సోకిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లకు కూడా వైరస్ సోకుతోంది. ఆ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్ కు వైరస్ సోకడంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

వీరికి వైరస్ సోకిందని బుధవారం నాడు నిర్ధారణ కావడంతో, రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్ కు హాట్ స్పాట్స్ గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

కాగా, తాజాగా వైరస్ సోకిన డాక్టర్లు గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్, పెట్లబుర్జ్ ఆసుపత్రికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగంలోని నలుగురు పీజీ రెసిడెంట్స్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్, పెట్లబుర్జు ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు, ఓ ప్రొఫెసర్ కు వైరస్ సోకింది. ఉస్మానియాలో అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్స్, నలుగురు హౌస్ సర్జన్లకు వైరస్ పాజిటివ్ వచ్చింది.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీ తుది సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, అందరు హెల్త్ కేర్ వర్కర్లకు తరచూ కరోనా టెస్ట్ చేయించాలని, పాజిటివ్ వచ్చిన వారిని విధుల నుంచి తప్పించి, క్వారంటైన్ లో ఉంచి వైద్య చికిత్సలు అందించాలని వారు డిమాండ్ చేశారు.

More Telugu News