River Yamuna: 25 ఏళ్లలో రూ. 5000 కోట్లు ఖర్చు పెట్టినా నెరవేరని లక్ష్యం.. లాక్‌డౌన్‌తో ఒక్క దెబ్బకు పరిష్కారం!

  • లాక్‌డౌన్‌తో మూతపడిన ఫ్యాక్టరీలు
  • రసాయనాలు కలవకపోవడంతో స్వచ్ఛతను సంతరించుకున్న యమునా నది
  • నదిని శుభ్రం చేసేందుకు 25 ఏళ్లలో రూ. 5 వేల కోట్ల ఖర్చు
River Yamuna Cleaned Itself In 60 Days

లాక్‌డౌన్ వల్ల దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గుతున్నాయన్న విషయాన్ని పక్కనపెడితే కొన్ని అద్భుతమైన ఫలితాలు మాత్రం కనిపిస్తున్నాయి. కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని శుభ్రం చేసేందుకు రెండున్నర దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా నెరవేరని లక్ష్యం ఒక్క లాక్‌‌డౌన్ కారణంగా నెరవేరింది. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.

1400 కిలోమీటర్ల పొడవైన యమునా నది దేశంలోని ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో హర్యానాలోని పానిపట్, ఢిల్లీ మధ్యనున్న దాదాపు 300 కర్మాగారాల నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు అందులోనే కలుస్తుంటాయి. ఫలితంగా దేశంలోనే అత్యంత కాలుష్యమైన నదిగా యమున మారిపోయింది. దీంతో నదిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితమే నడుం బిగించింది. ఇందుకోసం ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.

అయితే, ఇప్పుడు ఎవరి ప్రమేయం లేకుండానే, పైసా కూడా ఖర్చుపెట్టకుండానే నది శుభ్ర పడింది. పూర్తి స్వచ్ఛంగా మారింది. పక్షులు మళ్లీ నది వద్దకు వచ్చి వాలుతున్నాయి. చేపలు సహా నదిలోని ఇతర ప్రాణుల్ని వేటాడి ఆకలి తీర్చుకుంటున్నాయి. నది ఇలా ఒక్కసారిగా పరిశుభ్రంగా మారడానికి కారణం లాక్‌డౌనే. ఫ్యాక్టరీలు అన్నీ మూతపడడంతో వాటి నుంచి విడుదలయ్యే ప్రమాదరకర రసాయనాలు, మురుగు నీరు నదిలో కలవడం ఆగిపోయింది. ఫలితంగా నది శుభ్రపడింది. గతంతో పోలిస్తే ఢిల్లీ ప్రాంతంలో లాక్‌డౌన్ తర్వాత నది 33 శాతం స్వచ్ఛతను సంతరించుకున్నట్టు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ పేర్కొంది. గత 30 ఏళ్లలో నది ఇంత శుభ్రంగా ఉండడాన్ని తానెప్పుడూ చూడలేదని కమిటీలోని ఓ సభ్యుడు పేర్కొన్నాడు.

More Telugu News