Hockey legend: ఒలింపిక్స్‌లో మూడుసార్లు స్వర్ణాలు సాధించిన హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత!

  • మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బల్బీర్
  • ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ రికార్డు పదిలం
  • పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం
Hockey legent Balbir Singh passes away

మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ (95) ఈ ఉదయం కన్నుమూశారు. ఈ నెల 8న ఆయన ఆసుపత్రిలో చేరగా, అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు ఫార్టిస్ ఆసుపత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ఒలింపిక్స్ హాకీ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనతను బల్బీర్ సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆధునిక ఒలింపిక్ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజ హాకీ ఆటగాళ్లలో బల్బీర్ కూడా ఉన్నారు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా బల్బీర్ రికార్డులకెక్కారు. 1957లో భారత ప్రభుత్వం బల్బీర్‌ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

More Telugu News