Medchal Malkajgiri District: రైలుకు ఎదురెళ్లి ప్రేమ జంట ఆత్మహత్య.. మల్కాజిగిరి ప్రేమికులు మెదక్ జిల్లాలో ఆత్మహత్య

  • ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు
  • పెళ్లయినా కొనసాగిన ప్రేమ
  • భర్తతో గొడవపడి ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య
Lovers Suicide in Medak dist

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, పెద్దల బలవంతంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినప్పటికీ వారి మధ్య చిగురించిన ప్రేమ మాత్రం కొనసాగింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. పెళ్లిళ్లు అయినా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. వేర్వేరుగా బతడకం అసాధ్యమని భావించి చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన యువతి (29) యువకుడు (30)కి మధ్య ఓ దుస్తుల దుకాణంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. యువతికి భర్త, పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు. యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న భర్తతో యువతికి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ రాసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

ఇద్దరూ కలిసి బైక్‌పై మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. అక్కడ బైక్ పార్క్ చేశారు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలు కనిపించింది. ఇద్దరూ చేతులు పట్టుకుని దానికి ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. గమనించిన పైలట్ రైలు ఆపి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరినీ మల్కాజిగిరి వాసులుగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News