Husband: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తను నరికి చంపిన అల్లుడు!

  • భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి పోయిన భార్య
  • ఈ ఉదయం అత్త ఇంటికి వెళ్లి గొడవపడ్డ భర్త
  • అడ్డొచ్చిన అత్తను నరికి చంపిన వైనం
Murder in Nellore Dist

భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో... అత్తను అల్లుడు హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, దూబగుంట గ్రామానికి చెందిన తిరుపాల్ అనే వ్యక్తి చౌట భీమవరంకు చెందిన మహిళను పెళ్లాడాడు. మద్యానికి బానిసైన తిరుపాల్ ప్రతిరోజు భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో భర్తతో కలిసి ఉండలేక భార్య ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ రోజు ఉదయం ఫుల్ గా మందు తాగి భార్య పుట్టింటికి వెళ్లాడు.

తన భార్యతో తిరుపాల్ గొడవపడుతున్న సమయంలో పక్కనే ఉన్న అత్త పోలమ్మ అడ్డు వచ్చింది. దీంతో, కోపంతో రగిలిపోయిన తిరుపాల్... అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి, నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపాల్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News