Aarogya Setu App: ఆరోగ్యసేతుపై సందేహాలు అక్కర్లేదు... అత్యంత భద్రమైనది: కేంద్రం

Centre tells Aarogya Setu App highly encrypted
  • ఆరోగ్యసేతు యాప్ లో ఎన్ క్రిప్షన్ టెక్నాలజీ
  • డేటా లీకయ్యే అవకాశం లేదన్న నితి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్
  • వ్యక్తిగత గోప్యతే ప్రథమ ప్రాధాన్యతాంశం అని వెల్లడి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్ ను కేంద్రం వివిధ స్థాయిల్లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ భద్రతపైనా, దీన్ని కేంద్రం తప్పనిసరి చేస్తుండడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నితి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ స్పందించారు. ఆరోగ్యసేతు యాప్ అత్యంత భద్రమైనదని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయిలో ఎన్ క్రిప్షన్ సాంకేతికతను వినియోగించారని, సమాచారం లీకయ్యే అవకాశం ఉండదని వెల్లడించారు.

ఈ యాప్ ద్వారా సేకరించిన డేటా కేవలం కరోనా విధుల్లో ఉన్న అధికారులకు మాత్రమే చేరుతుందని, ఇందులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) మాత్రమే ఈ డేటాను పరిశీలిస్తుందని, అక్కడి నుంచి కరోనా విధుల్లో ఉన్న అధికారులకు మాత్రమే వెళుతుందని అమితాబ్ కాంత్ వివరించారు. అంతేకాదు, వ్యక్తిగత గోప్యత అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా భావించి ఈ యాప్ రూపొందించారని ఆయన అంతకుముందు చేసిన ఓ ట్వీట్ లో వెల్లడించారు.

కాగా, రాబర్ట్ బాప్టిస్ట్ అనే ఎథికల్ హ్యాకర్ ఇటీవలే ఆరోగ్య సేతు యాప్ పై ఆరోపణలు చేశాడు. ప్రజలపై నిఘా వేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ యాప్ అని పేర్కొన్నాడు.
Aarogya Setu App
Data
Niti Aayog
Centre
Corona Virus

More Telugu News