Kannababu: విశాఖ దుర్ఘటన మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేసిన ఏపీ మంత్రులు

  • బాధితులను పరామర్శించిన మంత్రులు
  • సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి
  • గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు ఈ రోజు రాత్రి బస
  • ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్న కన్నబాబు
kanna babu on vizag gas leak incident

విశాఖలోని ఆర్.ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో కొందరి కుటుంబాలకు ప్రకటించిన నష్ట పరిహారాన్ని ఏపీ మంత్రులు ఈ రోజు ఉదయం అందజేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు.

గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఈ రోజు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేశారు. వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్లు సిద్ధం కానందున మిగిలిన నలుగురికి తర్వాత అందజేస్తారు. అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన చెప్పారు.

ఈ  రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను వారి గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ఏపీలో పారిశ్రామిక ప్రాంతాల వద్ద భద్రతకు సంబంధించిన ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు. సీఎం జగన్‌ చేసిన సూచనల మేరకు ఏపీ మంత్రులు ఈ రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో బస చేస్తారని కన్నబాబు తెలిపారు.

More Telugu News