Roja: తల్లి గురించి చెబుతూ భావోద్వేగాలకు గురైన రోజా

  • ఇవాళ మదర్స్ డే
  • తల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా
  • తనను ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దిందంటూ కితాబు
YSRCP MLA Roja gets emotional on Mothers day

ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం కావడంతో ప్రముఖులు తమ మాతృమూర్తులతో అనుబంధాన్ని స్మరించుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తన తల్లి గురించి చెప్పారు. అమ్మ కారణంగానే తాను ఇవాళ మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళగా సమాజంలో కొనసాగుతున్నానని తెలిపారు. అమ్మ నేర్పిన విషయాలను తనను ఓ మంచి మనిషిగా మలిచాయని, తన స్ఫూర్తి అమ్మేనని చెప్పారు. తాను సినిమాల్లో ఎదగడానికి, రాజకీయాల్లో కొనసాగడానికి, ఆఖరికి ఓ గృహిణిగా విజయవంతం కావడానికి ఆమె ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అయితే ఈ రోజు ఆమె తమ మధ్య లేకపోవడంతో ఎంతో బాధ కలిగిస్తోందని చెబుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.

తామందరం జీవితంలో స్థిరపడ్డామని, ఇలాంటి స్థితిలో తమ పిల్లలతో ఆడుకోవాల్సిన అమ్మ ఈ లోకంలో లేకపోవడం తీరని లోటు అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీటిపర్యంతం అవుతానని, అయితే అమ్మ లేని లోటును తన భర్త తీరుస్తున్నాడని రోజా వెల్లడించారు. తల్లి చూపిన బాటలోనే తాను కూడా తన పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటానని, వాళ్ల కోరికలన్నీ తీర్చుతుంటానని వివరించారు.

More Telugu News