Dharmendra Pradhan: ఇండియా ముందు జాగ్ర‌త్త... వ్యూహాత్మకంగా ముడి చమురు నిల్వలు!

  • మరో వారంలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ నిల్వలు
  • అదనంగా 7 ఎంటీ ఆయిల్ రాక
  • వెల్లడించిన ధర్మేంద్ర ప్రధాన్
India eyes on Crude Storage with Strategy

అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌లు తక్కువగా కొనసాగుతున్న ఈ సమయంలోనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, భారీగా క్రూడాయిల్ ను నిల్వ చేసుకోవాలని భావిస్తోంది. కరోనా లాక్ డౌన్ తో చమురు వినియోగం భారీగా తగ్గిన వేళ, పెద్ద ఎత్తున ముడి చ‌మురును కొనుగోలు చేసి, వాటిని భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నట్టు పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వ్యాఖ్యానించారు. మరో వారం రోజుల్లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ నిల్వలకు ఇండియా చేరుకుంటుందని, దీనికి అదనంగా మరో 7 మిలియన్ మెట్రిక్ టన్నులు భారత కంపెనీల కాంట్రాక్టుల్లో భాగంగా దేశానికి వస్తుందని ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీతో ప్రపంచ ఆయిల్ సంస్థలు, సహజవాయు పరిశ్రమల ప్రతినిధులు సమావేశం కాగా, ఐహెచ్ మార్కిట్ వైస్ చైర్మన్, పులిడ్జర్ బహుమతి విజేత డానియెల్ యార్జిన్ కూడా హాజరయ్యారు. ఆపై డానియెల్ తో ప్రత్యేకంగా ధర్మేంద్ర ప్రదాన్ భేటీ అయ్యారు. ఈ నెలలోనే ముడి చమురు నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుతాయని ఈ సందర్భంగా ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ప్ర‌పంచంలో క్రూడ్ ఆయిల్ ‌ను అత్యధికంగా దిగుమ‌తి చేసుకుంటున్న దేశాల్లో, ఇండియా ప్ర‌స్తుతం 3వ స్థానంలో ఉంది. ఇండియాలో 5.3 ఎంటీ ఆయిల్ ను నిల్వ చేసుకునే సౌకర్యం ఉండగా, విశాఖపట్నంలో 1.33 ఎంటీ, మంగళూరులో 1.5 ఎంటీ, పాడూరులో 2.5 ఎంటీ ముడి చమురును నిల్వ చేసుకోవచ్చు. దీనికి అదనంగా కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో మరో 6.5 ఎంటీ క్రూడాయిల్ స్టోరేజ్ వీలుకల్పించేలా ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది.

భారత పెట్రో ఉత్పత్తుల డిమాండ్ లో 85 శాతం ఇత‌ర‌ దేశాల నుంచి దిగుమ‌తి కావాల్సిందే. ప్ర‌స్తుతం లాక్ ‌డౌన్ నేప‌థ్యంలో క్రూడ్ ఆయిల్‌ కు డిమాండ్ త‌గ్గింది. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా క్రూడాయిల్ ధర పతనమైంది. ఓ ద‌శ‌లో ఆయిల్ ధ‌ర‌ మైన‌స్ ‌లోకి కూడా వెళ్లింది. ఈ క్ర‌మంలోనే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా, ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న ఈ స‌మ‌యంలోనే పెద్ద ఎత్తున ముడి చ‌మురును దిగుమ‌తి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ లో చమురు ధర బ్యారల్ కు 20 డాలర్ల దిగువనే కొనసాగుతోంది.

సౌదీ అరేబియా నుంచి అద‌నంగా కొనుగోలు చేసిన 5.33 మిలియ‌న్ ట‌న్నుల ఆయిల్‌ను భూగ‌ర్భ స్టోరేజ్ రిజ‌ర్వ్‌ల‌లో భార‌త్ స్టోర్ చేసింది. అలాగే వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయించింది. ఇక మ‌రో 7 మిలియ‌న్ ట‌న్నుల ఆయిల్‌ను షిప్పుల్లో నిల్వ చేశారు. మరో 25 మిలియ‌న్ ట‌న్నుల ఆయిల్‌ను ఇన్‌ల్యాండ్ డిపోలు, ట్యాంకులు, రిఫైన‌రీ పైప్‌లైన్ల‌లో నిల్వ చేశారు. కాగా ప్ర‌స్తుతం బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర అంత‌ర్జాతీయ మార్కెట్‌లో 20 డాల‌ర్ల క‌న్నా త‌క్కువ‌గానే నమోద‌వుతోంది.

More Telugu News