Muslim Families: హర్యానాలో హిందూ మతంలో చేరిన 40 ముస్లిం కుటుంబాలు

  • ఓ వృద్ధురాలికి హిందూ మతాచారాల ప్రకారం అంత్యక్రియలు
  • మొఘల్ పాలనలో మతమార్పిడికి గురైనట్టు తెలుసుకున్న గ్రామస్తులు
  • హిందూత్వ స్వీకరణలో ఎవరి ఒత్తిడిలేదన్న ముస్లిం కుటుంబాలు

హర్యానాలో తాజాగా 40 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది హిందూమతం స్వీకరించారు. హిసార్ జిల్లాలోని భీత్మడా గ్రామానికి చెందిన ఈ కుటుంబాలు హిందూత్వంలోకి ప్రవేశించడమే కాకుండా, హిందూ మతాచారాల ప్రకారం ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు కూడా నిర్వహించాయి. ఈ గ్రామానికి చెందిన చాలామంది ముస్లింలు మొఘల్ పాలకుడైన ఔరంగజేబు కాలంలో బలవంతంగా మతమార్పిళ్లకు లోనైనట్టు పూర్వీకుల ద్వారా తెలుసుకున్నారు. ఊళ్లో ఉన్న ముస్లింలు హిందువుల పండుగలన్నీ జరుపుకుంటారని, ఎవరైనా చనిపోతే మాత్రం ముస్లిం పద్ధతిలో ఖననం చేసేవారని ఓ వ్యక్తి తెలిపాడు.

ఇటీవలే గ్రామంలో అత్యధికులు హిందూమతంలోకి రావడంతో పాటు, ఇటీవలే మరణించిన 80 ఏళ్ల వృద్ధురాలి అంత్యక్రియలు హిందూ మతాచారాలకు అనుగుణంగా నిర్వహించారు. మతం మారాలని ఏవైనా ఒత్తిళ్లు వచ్చాయా అని సదరు వ్యక్తిని మీడియా ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, ఏ ఒక్క గ్రామస్తుడు తమతో అమర్యాదగా ప్రవర్తించింది లేదని స్పష్టం చేశాడు. గతంలో అన్నీ బాగానే ఉన్నా, అంత్యక్రియల వద్దకు వచ్చేసరికి మతం వేరన్న విషయం స్పష్టంగా కనిపించేదని, గ్రామస్తులు తమను ప్రత్యేకంగా చూసేవాళ్లని, ఇప్పుడా బాధ లేదని మాజిద్ అనే యువకుడు తెలిపాడు. భవిష్యత్ ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

More Telugu News